




• అన్న క్యాంటీన్లో అల్పాహారం చేసిన కమిషనర్ చల్లా ఓబులేసు
బాబూ.. టిఫిన్ బాగుందా? రోజు ఇక్కడే టిఫిన్ చేస్తావా? సిబ్బంది ఎలా వ్యవహరిస్తారు? అంటూ నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అన్న క్యాంటీన్లో స్థానికులతో అప్యాయంగా మాట్లాడారు. బుధవారం ఉదయం కొండారెడ్డి బురుజు వద్ద ఉన్న అన్న క్యాంటీన్, ముజఫర్ నగర్ రోడ్డులో ఉన్న అన్న క్యాంటీన్ను కమిషనర్ పరిశీలించారు. పారిశుద్ధ్య తనిఖీల అనంతరం ముజఫర్ నగర్ రోడ్డులోని అన్న క్యాంటీన్లో ఆయన అల్పాహారం చేశారు. ఆయనతో పాటు ఆయన సిబ్బంది, ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం. రఘుతో సైతం అల్పాహారం చేయించి రుచిపై ఆరా తీశారు. స్వయంగా టోకెన్ తీసుకుని, అల్పాహారం చేస్తున్న వారితో మాట్లాడుకుంటూ అల్పాహారం చేశారు. అన్న క్యాంటీన్ల పరిసరాల్లో తిరిగారు. తాగునీటిని శుభ్రమైన ప్రదేశాల్లో ఉంచాలని, డస్ట్బిన్లను ప్రతిరోజు శుభ్రం చేయాలని సూచించారు. అన్న క్యాంటీన్లలో భోజనం చేసే ప్రతి ఒక్కరూ సంతృప్తి చెందేలా, నాణ్యత, పారిశుద్ధ్య ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.
కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం.రఘు, శానిటేషన్ ఇంస్పెక్టర్లు రమేష్, లోకేష్, ఎంజల్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.
###By SK Mahesh gupta ###